Friday, January 2, 2015

మనిషి - ఇంద్రియాలు - మహనీయత


ప్రయత్నిస్తే మనిషే ఏదో ఒకనాటికి మహనీయుడిగా మారగలడు. కానీ, ఆ విధంగా మారాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఆ మనిషికి అటువంటి ఆలోచన రానివ్వకుండా చేయగలిగేవి ఇంద్రియాలు, అలాగే, ఆ ఆలోచన కలిగేందుకు, మహనీయతను పొందేందుకు సహకరించగలిగేవి కూడా ఇంద్రియాలే. మనిషికి - అతని మహత్వానికి మధ్యనున్న వారధి ఇంద్రియాలు. అయితే, ఇప్పుడున్న వేగవంతమైన కాలంలో మనిషి గొప్ప సంపాదనాపరుడిగా ఎదగగలుగుతున్నాడు, కానీ, వ్యక్తిగా ఎదిగి మహోన్నత వ్యక్తిగా మారాలన్న ఆలోచనకు దూరంగా ఉంటున్నాడు. కారణం, ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి నిద్రించే వరకు అతని ఇంద్రియాలే అతణ్ణి నడిపిస్తున్నాయి. చూసిన దాన్నే ఆలోచించటం, నచ్చిన వైపుకి పరుగులు తీయటం, మనసు ఏది కోరుకుంటే దాని వెంట ఆలోచనలను నడిపించటం... ఇలా అన్నీ తన ఇంద్రియాలపై ఆధారపడి చేయటం వలన మనిషి "సహజంగా ఉన్న తానేమిటో? తన జీవితానికి ఉన్న విలువైన అర్థం ఏమిటో?" తెలియకుండానే రోజులను, సంవత్సరాలను, మొత్తం జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ, ఒక్కసారి ఆలోచిద్దాం...


భగవద్గీతలో చెప్పినట్టు, "ఇంద్రియాలు గుర్రాల వంటివి. అవి నడిపించిన చోటికి వెళ్తే దారి తప్పుతాం. మనల్ని నడపవలసింది మన బుద్ధి. మన బుద్ధి ఆధీనంలో మన ఇంద్రియాలు (కళ్ళు - చూడటం; ముక్కు - శ్వాస; చెవి - వినటం; నాలుక - రుచి, మాట్లాడటం; స్పర్శ) ఉండాలి తప్ప, వాటికి బానిసగా మనం ఉండకూడదు" అనేది ఒక గొప్ప సందేశం. ఇప్పటి ప్రపంచంలో చుట్టూ ఎన్నో లెక్కలేనన్ని ఆకర్షణలు ఉన్నాయి. ప్రతి ఆకర్షణకూ లొంగిపోతూ వెళితే మన బుద్ధిని - వివేకాన్ని మనమే మరచిపోయి ప్రవర్తించే స్థితి కలుగుతుంది. గుర్రానికి విశ్రాంతి అనేదే ఉండదు, అది నిద్రపోతున్నా కదులుతూనే ఉంటుంది. దానిలాగే మన ఇంద్రియాలు కూడా, వాటికి విశ్రాంతి అనేది ఉండదు. ఒకదాని తర్వాత మరొకటి వెతుక్కుంటూనే ఉంటాయి. అటువంటి ఇంద్రియాలను సరియైన విధంగా ఉపయోగించటం నేర్చుకుంటే, అవే మనకు గొప్ప జీవితాన్ని, గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. చూసిన ప్రతీది కావాలి అనుకునేముందు బుద్ధితో దాని గురించి ఆలోచించుకోవాలి. ఎంత అభివృద్ధి సాధించినా, మనిషి తన మూలాలను మరచిపోతే, ఆ అభివృద్ధే వినాశనకారిగా మారగలదు. మూలాలను మరచిపోకుండా మనం సాధించే ప్రగతి, వ్యక్తిగతంగానే కాకుండా ప్రపంచ ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి ప్రగతిని సాధించటం మన భారతీయులకే సాధ్యం. అందుకే, మన పెద్దలు చెప్పిన విధంగా, వివేకంతో సంపూర్ణమైన ఆలోచనతో ఒకరికి ఒకరుగా సహకరిస్తూ అడుగులు వేస్తే, అభివృద్ధిలో ముందడుగు వేయగలం. పవిత్రమైన మన భారతావనిని పవిత్రంగానే మూలాలతో కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు ప్రతి మనిషీ మహనీయతను పొందినవాడు అవుతాడు.


No comments:

Post a Comment